జాషువ
నవ యుగ కవి చాక్రవర్తి గుఱ్ఱం జాషువాను ఈనాటి కవులందరూ స్పూర్తిగా తీసుకోవాలి. అస్పృశ్యత, మూఢ నమ్మకాలపై ఆయన తన కవిత్వం ద్వారా పోరాటం జరిపారు. సమస్యలు రూపం మార్చుకొని ఈ నాటి సమాజంలో కుడా రాజ్యమేలుతున్నాయి. వాటిని రూపుమాపాల్సిన బాధ్యత కవులు, రచయితలూ, కళాకారులపై ఉంది.
జాషువ కేవలం దళిత కవే కాదు. వినుకొండ నుంచి విశ్వనరుడిగా ఎదిగిన గొప్ప కవి. ఆయనే చెప్పినట్టుగా "సుకవి జీవించు ప్రజల నాల్కల యందు" అన్న మాట అక్షర సత్యం. ఈనాటికీ ఏనాటికీ జాషువ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారు. తక్కువ కులంగా భావించబడిన కులంలో జన్మించి ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని మూఢాచారాలపై తిరగబడి ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. ఆయనకు జీవితమే పాఠాలు నేర్పింది.
ఆయన "నా గురువులు ఇద్దరు - పేదరికం, కుల మత బేధం. ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మాత్రం మార్చలేదు. దారిద్యాన్ని, కుల బేధాన్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలచాను. వాటి పై కత్తి కట్టాను. అయితే నా కత్తి కవిత. నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు. దాని విధానంపై ద్వేషం" అని తన కవితా విధానాన్ని స్పష్టం చేశారు. ఈ నాటి సంక్లిష్ట సమాజంలో జాషువ విధానాన్ని ఆచరించాల్సిన అవసరం మనందరికీ ఎంతో ఉంది. ఆత్మన్యూనతా భావాన్ని వీడనాడి విశ్వాసంతో ముందుకు సాగాలి.
మానవతా కవితా మూర్తి జాషువ ఆశయాలకు అనుగుణంగా సమాజం కుల, మత విద్వేషాలను విడనాడి ప్రతి మనిషీ సాటి మనిషిలో మానవత్వాన్ని దర్శించగలిగినప్పుడే ఆయన కవితా స్పూర్తికి ఘనమైన నివాళి. జాషువా స్పూర్తితో ముందుకు సాగుదాం..
-సోమేపల్లి వెంకట సుబ్బయ్య